మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై ఈ నెల 21న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ పిటిషన్పై సీజేఐ ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విచారణకు స్వీకరించిన కోర్టు 21న విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది.
దాంతో ఆయన ఎంపీగా అనర్హత ఎదుర్కొంటున్నారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు సైతం నిరాకరించింది. సూరత్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈనెల 7న గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.