కౌలు డబ్బులు అడిగేందుకు సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వెళ్ళిన రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమైన విషయమని ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని గా అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం తీరు గర్హనీయమని ఆయన అన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ సకాలంలో వార్షిక కౌలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
28 వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం సి.ఆర్.డి.ఏ. రైతులతో చేసుకొన్న ఒప్పందం ఎకరాకీ ప్రతి ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉందని వీర్రాజు తెలిపారు.
కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని అందువలన రైతులు రొడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
న్యాయం కోసం వచ్చినవారిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ,ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 21వ తేదీన కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ జమా కాలేదన్నారు.
ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.