ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా దివాలా దిశగా వేగంగా పయనిస్తున్నది. రాష్ట్ర రుణపరిమితిని కట్టడి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఆర్ధికంగా గిజగిజలాడే పరిస్థితి తలెత్తబోతున్నది.
ఇప్పటికే జీత భత్యాలు చెల్లించలేని స్థితిలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఉచిత పథకాలను కూడా అమలు చేయలేని స్థితికి చేరబోతున్నట్లు కనిపిస్తున్నది.
రాష్ట్ర రుణ పరిమితిని 42,472 కోట్లగా గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే తదుపరి నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5 శాతం రుణ పరిమితి మించరాదనే నిబంధన వచ్చింది
దాంతో రాష్ట్ర రుణ పరిమితిని రూ.37,163 కోట్లకు సవరించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో మరో రూ.17,810 మేరకు బహిరంగ మార్కెట్ రుణాలు తెచ్చుకోవడానికి ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.
అన్ని విషయాలనూ పరిశీలించిన తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ దీనికి అనుమతి ఇస్తూ దీన్ని మొత్తం రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ గత నెల 30న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసింది. ఈ లేఖ వివరాలను పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి చైర్మన్, శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ నేడు బహిర్గతం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ రాసిన లేఖను ఆయన నేడు విడుదల చేశారు.
రూ. 17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది పయ్యావుల తెలిపారు.
ఈ పరిధికి మించిన అప్పును సర్దుబాటు చేయడం ఇక్కడ గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.