రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా జంట నగరాలలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న బ్రాహ్మణ వర్గాలను సంతృప్తి పరచే చర్యలను ఆయన తీసుకుంటున్నారు.
సాధారణంగా బిజెపి వైపు చూసే బ్రాహ్మణ వర్గాలను ఆకట్టుకుంటే జీహెచ్ఎంసిలో దాదాపు 30 నుంచి 40 స్థానాలు సులభంగా వచ్చేస్తాయి. అందులో భాగంగానే మాజీ ప్రధాని పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెరపైకి తీసుకువచ్చారని అంటున్నారు. పి వి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించే ప్రకటన వచ్చిన నాటి నుంచి కేసీఆర్ పై బ్రాహ్మణ సంఘాలకు విపరీతమైన అభిమానం పెరిగింది.
మాజీ ప్రధాని పి వి నరసింహారావు ను కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించడం, బిజెపి పట్టించుకున్నట్లు ఉన్నా సాధికారికంగా ఏదీ చేయకపోవడం తో బ్రాహ్మణులలో అసంతృప్తి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి భూస్వాముల పనిపట్టి సమాజంలో అట్టడుగు వర్గాలకు పెద్ద పీట వేసిన పివీ నరసింహారావు కేవలం బ్రాహ్మణుడు కావడం వల్లే ఎవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉంది.
ముఖ్యంగా ఎస్ సి వర్గాల అభ్యున్నతికి అడ్డుగా నిలిచిన వర్గాలను పి వి నరసింహారావు అణచివేశారు. అదే విధంగా జవహర్ లాల్ నెహ్రూ ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా మార్చివేసి సరళీకృత ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా పీవీదే.
అయితే రాజకీయ కారణాలు, కుల రాజకీయాలతో పి వి ప్రతిభను అందరూ కలిసి మరుగున పెట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పి వి నరసింహారావు ఆలోచనలకు పెద్దపీట వేయడం బ్రాహ్మణ వర్గాలకు పూర్తిగా సంతృప్తినిచ్చింది. దేశ విదేశాల్లో కూడా నివాళులు అందుకోవాల్సిన పి వికి కనీసం పుట్టిన గడ్డ మీద అయినా గౌరవం దక్కుతున్నందుకు బ్రాహ్మణులు సంతోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను మరింత ఆకట్టుకోవడానికి వీలుగా పీ వీ నరసింహారావు కుమార్తె, విద్యా సంస్థల నిర్వాహకురాలు అయిన పి వి వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిసింది.