అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో అయిదుగురు కార్మికులు మృతి చెందారు. లారస్ ల్యాబ్స్ యూనిట్ 3లో ఉత్పత్తి లేని బ్లాక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో రియాక్టర్ నుంచి మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావులు, సతీష్ మృతి చెందారు. షార్ట్సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పరవాడ అగ్నిప్రమాద ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ లారెస్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ అన్నారు.