అమరావతి – నాగపూర్ హైవే నిర్మాణంలో రైతులకు సంబంధించిన భూముల బలవంతపు సర్వేను నిలిపి వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన రైతుల సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ పరిహారం విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నారని, కనీసం రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిర్బంధించి సర్వే నిర్వహించడం నియంతృత్వాన్ని గుర్తుకు తెస్తుందన్నారు.
రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వేను నిర్వహిస్తుంటే ప్రశ్నించిన పాపానికి రైతులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని గోవిందరావు తెలిపారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. పరిహారం విషయంలో మార్కెట్ ధరకు అనుగుణంగా చెల్లించేందుకు ప్రభుత్వం పునః పరిశీలన చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోరుతుందన్నారు.
నాగపూర్- అమరావతి బాధిత రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అధికార యంత్రాంగం రైతుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రైతులు కూచిపూడి రవి, వేముల సతీష్, పెంట్యాల వెంకటేశ్వర్లు, అనుబోతు వెంకటేశ్వర్లు, ఆవుల సైదులు, వాల మధుసూదన్ రెడ్డి, జలగం రాజారావు, చిట్టిమోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.