గృహలక్ష్మి విషయంలో ప్రభుత్వ నిబంధన సొంతన లేనిదిగా ఉందని రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు నిబంధన విధించడం ఏమిటని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రశ్నించారు. ఇచ్చినట్లే ఇచ్చి అర్హులకు దక్కకుండా చేయాలనేది ప్రభుత్వ ప్రణాళికలా ఉంది తప్ప మరొకటి కాదన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో పోటుప్రసాద్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం పేరుతో దశాబ్ద కాలంగా పేదలకు ఇండ్ల కేటాయింపు జరగలేదని ఇప్పుడు గృహలక్ష్మి పేరుతో సొంత స్థలాలో ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించినప్పటికీ నిబంధనలు చూస్తే చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. రేషన్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు జారీ చేయలేదని, లేని రేషన్ కార్డును నిబంధనలో ఎలా చేర్చారన్నారు.
ఇప్పటికైనా గృహలక్ష్మి పథకానికి సంబంధించి మరో అవకాశం కన్పించి రేషన్ కార్డు నిబంధనను సడలించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ శత జయంతోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మంలో జాతీయ స్థాయి జన సేవా దళ్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శతజయంతోత్సవాల సందర్భంగా ఢిల్లీలో లక్ష మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహించనున్నామని అందులో భాగంగా శిక్షకులకు ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్లు ప్రసాద్ తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి 200 మంది ఈ శిక్షణకు రానున్నారని శిక్షణ పూర్తయిన తర్వాత తిరిగి రాష్ట్రాల స్థాయిలోనూ ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో జన సేవాదళ్ శిక్షణ దేశ వ్యాప్తంగా
కొనసాగుతుందన్నారు. ఇందు కొరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు రావి శివరామకృష్ణ, గాదె లక్ష్మి నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి ఏసు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.