అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సౌజన్యంతో బాగ్ అంబర్ పేటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గత నెల రోజులుగా అయ్యప్ప స్వాముల కోసం నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం నేటితో ముగిసింది.
ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన సతీమణి కాలేరు పద్మావెంకటేష్ తో కలిసి హాజరై అయ్యప్ప స్వాములకు స్వయంగా బిక్షను వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నెల రోజుల పాటు అయ్యప్ప స్వాములకు ఉచితంగా బిక్షను ఏర్పాటు చేసే అవకాశం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు చేసుకునే ఎంతో మంది అయ్యప్ప స్వాములు వివిధ కారణాల వలన సమయానికి బిక్ష దొరకక, ఇంట్లో అనుకూలించక ఇబ్బందులు పడేవారని, వారందరికీ ఈ ఉచిత అన్నదాన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షిచారు. నెల రోజుల పాటు ఉచితంగా బిక్షను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి అయ్యప్ప స్వాములు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట