ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం నుంచి లింగపాలెం మండలం బాధరాల గ్రామాల మధ్య ఎట్టకేలకు రహదారి నిర్మాణం పూర్తయింది. పందెం కోడి పందాల బిర్రిలో ఎగరకముందే రహదారి నిర్మిస్తానని మాట ఇచ్చిన దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి తన మాట నెరవేర్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోక ప్రజలు నరకం చూశారు.
ఆయాగ్రామాల ప్రజలు, అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మా రోడ్డు నిర్మించండి బాబూ అని పలుమార్లు రామసింగవరం, బాధరాల గ్రామస్తులు వినతి పత్రాలు సమర్పించారు. ఇలా వచ్చిన వినతికి స్పందించిన ఎమ్మెల్యే ఈ రహదారి నిర్మాణానికి అధికారులను పిలిపించి ప్రతిపాదనలు తయారు చేయించారు.
రహదారి అభివృద్ధికి ఎస్టిమేషన్ ప్రతిపాదనలు తయారు కాగానే ప్రభుత్వానికి పంపి పనులు ప్రారంభించారు. పందెం కోడి ఎగరకుండానే రహదారి నిర్మాణం పూర్తి అవుతుండటం తో రామసింగవరం, బాధరాల గ్రామాల ప్రజలతో బాటు ఈ రహదారి వెంట వెళ్లే రంగాపురం, ఆసన్నగూడెం, కల్లాచెరువు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.