కని పెంచి ప్రయోజకులను చేసిన బంధం కరోనా కాటుకు బలయ్యింది. కానీ పేగు బంధం మాత్రం జ్ఞాపకాలను స్మరిస్తోంది. బంధాన్ని విధి దూరం చేసినా, పెంపకం మాత్రం సేవా గుణం నేర్పింది. బాన్సువాడ పట్టణానికి చెందిన జనగామ కిష్టయ్య-వీరమని దంపతులు గత ఏడాది కరోనా బారినపడి కానరాని లోకాలకు వెళ్లగా వారి స్మృత్యర్ధం తనయులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కిష్టయ్య-వీరమని దంపతుల మొదటి వర్ధంతి సందర్భంగా తనయులు పాత బాన్సువాడలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణానికి చెందిన సెవెన్ హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం సౌజన్యంతో శిబిరం ఏర్పాటు చేశారు. సాధారణ, ఇతరత్రా జబ్బులు గల వారికి వైద్య పరీక్షలు జరిపారు. వైద్య బృందం రోగులకు తగిన సలహాలు, సూచనలు అందించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. దీర్ఘకాలిక రోగులు, వృద్దులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు.
సేవా భావం గొప్పది
ఎవరికి వారు నాకేమిటని స్వార్థంతో మసులుతున్న నేటి రోజుల్లో జన్మనిచ్చిన వారి యాదిలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగినదని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పిన కన్నవారి ప్రేమను పదుగురు మెచ్చేలా సేవా కార్యక్రమాలతో మరిచిపోకుండా ఉండడం పట్ల జనగామ పరివారాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మంచికి మారుపేరుగా నిలిచిన తమ తల్లిదండ్రుల వల్లే తమకు సమాజంలో గుర్తింపు లభించిందని, విద్యాబుద్ధులు నేర్పి తమను ఈ స్థాయికి చేర్చిన తల్లిదండ్రుల ప్రేమానురాగాలను మర్చిపోలేమని అన్నారు.
సేవా కార్యక్రమాలతో గుండెల్లో పదిలపర్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వాగ్దేవి సామినేని, భార్గవ చంద్ర, అవినాష్, వార్డు కౌన్సిలర్ వెంకటేష్, గ్రామ పెద్దలు దోనకంటి సాయిలు, జగన్ మోహన్, మల్లూరు సాయిలు,రాములు, బుజిగారి సాయిలు, వినోద్, జనగామ వినోద్, లక్ష్మీకాంత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం