పలు వివాదాల మధ్య పాలన సాగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మరో ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి గా ఉన్న జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పని చేస్తున్నారు.
ఆయనను ఇక నుంచి సీఎం కార్యాలయం స్పెషల్ సీఎస్గా పూర్తి స్థాయిలో బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టీటీడీ ఈఓగా ఉన్న జవహర్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం అదనపు ఈఓ గా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ధర్మారెడ్డి తిరుమల కొండపై తిరుగులేని అధికారాలను ఇప్పటికే చలాయిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయనకు మరిన్ని అధికారాలు సంక్రమించనున్నాయి.