భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అటవీ ప్రాంతమైన చర్ల మండలం కుర్నపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారుగా 500 కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చర్ల పోలీసులు ఏర్పాటు చేశారు. కుర్నపల్లి,ఎర్రబోరు, బోదనెల్లి, రామచంద్రపురం, బత్తినపల్లి, కొండవాయి గ్రామాలకు చెందిన 500ల కుటుంబాలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్ పాల్గొన్నారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయ గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకే జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసారు.
అర్ధరాత్రి సమయాల్లో గ్రామాల్లోకి వచ్చి మావోయిస్టులు అమాయకపు ఆదివాసి గిరిజనులను చంపడం క్రూరమైన చర్య అన్నారు. ప్రజల మద్దతు లభించకనే అర్ధరాత్రి వేళల్లో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి,ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల గ్రామాల్లోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చదువుకునే విద్యార్థులకు సోలార్ విద్యుద్దీపాలను అందించారు. ఇటీవల కుర్నపల్లి గ్రామంలో మావోయిస్టుల చేతిలో హత్య చేయబడిన ఉప సర్పంచ్ ఇర్ఫా రాముడు ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా పోలీస్ శాఖ ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు.అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వారికి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను వీలైనంత త్వరలో అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.