తిరుపతిలోని ఎన్టీసీ మిల్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తద్వారా ఈ మిల్లునే నమ్ముకొని జీవనం గడిపే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు వెయ్యి కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దేశ వ్యాప్తంగా 23 టెక్స్టైల్ మిల్లులను నడుపుతోన్న ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (ఎన్.టి.సి) ద్వారా నడపబడుతున్న మిల్లులలో తిరుపతిలో నడపబడుతున్న కాటన్ మిల్ ఒకటని ఈ టెక్స్టైల్ మిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు వెయ్యి కుటుంబాలను జీవనోపాధి కల్పిస్తూ ఆదుకుంటుందని సభకి వివరించారు. కరోనా మహమ్మారి వలన దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా అన్ని ఎన్.టి.సి మిల్లులలో ఉత్పత్తి కార్యకలాపాలు మార్చి 2020 నుండి నిలిపివేయబడ్డాయన్నారు.
కరోనా లాక్డౌన్ సమయంలో టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొన్న అపారమైన ఆర్థిక నష్టాలు చాలా వరకు ఎన్.టి.సి మిల్లులు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించకుండా నిలిపివేశాయన్నారు. అలాంటి పరిస్థితే తిరుపతిలోని ఎన్టీసీ మిల్లుకు కూడా ఎదురైందని ఏది ఏమైనప్పటికీ ఈ మిల్లుకు తగినంత వనరులు ఉన్నాయని దానిని పూర్తిగా పనిచేసే దశకు తీసుకురావడానికి మరమ్మత్తు మరియు ఆధునీకరణ కోసం తగినంత పెట్టుబడి అవసరమన్నారు.