విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం లోని నాగావళి నదిపై కొమరాడ మండలంలో నిర్మిస్తున్న పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయిస్తామని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి పుష్ప శ్రీవాణి చొరవతో జగన్ ప్రభుత్వం 14 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న వంతెనను గత ఏడాదిలో అధికారులతో కలిసి పుష్ప శ్రీవాణి సందర్శించి నిలిచిపోయిన పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉన్నాయి., మరో 9 పంచాయతీలు అవతలి ఒడ్డున ఉన్నాయి.
అయితే నాగావళి నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి 50-60 కిలోమీటర్ల దాకా వెళ్లాల్సివస్తోంది. నిర్మాణంలో జరిగిన ఆలస్యం తో 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగానే అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికితీసుకొచ్చి వివరించారు..
దీంతో వెంటనే డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ ప్రకారంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈ వంతెన నిర్మాణానికి 7 కోట్లను కేటాయించారు. ఇది కాకుండా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా మరో రూ.7 కోట్లను కూడా కలుపుకొని మొత్తం 14 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్.500 ను జారీ చేసింది. ఈ నిధుల మంజూరుతో పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. దీంతో నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం కొమరాడ ప్రజలు కంటున్న కల కూడా నెరవేరనుంది.