Slider జాతీయం

గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ

#MaoistLetter

సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోబోతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. గణపతి ఎక్కడ ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాలపై సత్యం న్యూస్ నిన్ననే ఒక ప్రత్యేక కథనాన్ని పోస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పందించారు. ఆయన విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం: మోదీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర, తెలంగాణ, ఛత్తీస్ గడ్ ఇంటలిజెన్సీ సంస్థలు కలిసి తయారు చేసిన కట్టుకథను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మీడియా చేస్తున్న చౌకబారు ప్రచారం

ఫాసిస్టు మోడీ, అమిత్ షా, చంద్రశేఖర్ రావు, విజయ్ కుమార్, కేంద్ర ఇంటలిజెన్సీ సంస్థ, తెలంగాణ ఎఎబి, ఛత్తీస్ గడ్ ఇంటలిజెన్సీ ఎజెన్సీలు కలిసి ఈ హై టెంక్షన్ కట్టుకథను తయారు చేసి, అమ్ముడు పోయిన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నీచమైన, దుర్మార్గమైన చౌకబారు ఎత్తుగడల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం.

నరహంతక మోడీ పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. నిరుద్యోగం తారా స్థాయికి చేరింది. ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. హిందూత్వ ఎజెండాలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలోకి దిగారు.

ట్రంపు సేవలో మునిగిన మోడీ

జనవరి నెలలో కోవిడ్-19 గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించినా మోడీ ప్రభుత్వం ప్రపంచ టెరరిస్టు ట్రంపు సేవలో మునిగిపోయింది. మార్చి నెలలో అకస్మాత్తుగా విధించిన లా డౌన్ల వలన దేశ ఆర్థిక వ్యవస్థ పతనపు అంచులకు చేరింది. లాక్ డౌన్ అంటేనే ఫాసిస్టు నిర్భందమని ప్రజలకు అర్థమైంది.

ఈ లాక్ డౌన్ కాలంలోనే దేశ వనరులను, సంపదను దేశ, విదేశీ కార్పోరేట్లకు అప్పజెప్పె అనేక చర్యలను మోడీ ప్రభుత్వం చేపట్టింది. దీనికి ముందే ప్రశ్నించే గొంతులను, సామాజిక కార్యకర్తల వంటి వందల మంది మీద కల్పిత కేసులు పెట్టి, జైళ్ళలో నిర్బంధించింది.

మరో వైపున కాశ్మీర్ లో సైనిక బలగాలను దించి దానిని మరొక పాలస్థీనాగా మార్చింది. నాగా, ఇతర ఈశాన్య జాతుల సమస్యల మీద కూడా సైనిక పరిష్కారాన్ని ఎంచుకుంటున్నది. కాశ్మీర్ విషయంలోనూ ఇంకా ఇతర సమస్యల విషయంలోనూ మోడీ ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

చైనాతో సమస్య పరిష్కారంలో విఫలం

ఇటీవల కాలంలో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణను పరిష్కరించటంలో ఘోరంగా వైఫల్యం చెందింది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించినట్లయితే, అంతర్జాతీయ వేదికల మీద తగిన ఆధారాలు చూపించి ఇతర దేశాల మద్దతును కూడగట్టాలి.

అది చేయకుండా దేశంలో మీడియాలో యుద్ధ ప్రేలాపనలు, దేశ భక్తి నాటకాలు ఆడి చైనా యాప్ లను నిషేధించి గూగుల్, రిలయన్స్ లకు దేశ మార్కెట్ ను అప్పజెప్పింది. మరో వైపున అమెరికా చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొటే ప్రకటనలు చేస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది.

ఫాసిస్టు మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాల కోసం ఇటువంటి నాటకాలు అడుతున్నారని, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను అసలు సమస్యల నుండి పక్క దారి పట్టిస్తున్నారని అర్థమవుతున్నది. అమెరికా-చైనాల మధ్య 2018 నుండి వ్యాపార, వాణిజ్య యుద్దాల రూపంలో ఘర్షణ మొదలైంది.

దీనిలో దళారీ మోడీ అమెరికా తరపున ఒక పావుగా పనిచేస్తున్నాడు. దేశ ప్రజల ప్రయోజనం దీనిలో శూన్యం. దళారీ మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్, రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్, అజిత్ దోవల్, విజయ్ కుమార్ వంటి వారు నెంబర్ వన్ దేశ ద్రోహులు.

వీరిని తరిమి కొట్టవలసిన సమయం అసన్నమైంది. అంబానీ, అదానీ ప్రయోజనాలే వీరికి ముఖ్యం. దేశంలో రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పోలీస్, మిలటరీ యంత్రాంగాలు మరియు ప్రచార అంగాలన్నీ ఫాసిస్టు కాషాయ భావజాలంతో కూడిన వ్యక్తులతో నిండిపోయాయి.

కార్పొరేట్ కళ్యణ్ యోజన

దేశంలో నేడు ఉన్నది భయానక, దుర్మార్గ పచ్చి ఫాసిస్టు పాలన. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు అన్నీ దేశ, విదేశీ కార్పోరేట్ల సేవలో మునిగి తేలుతున్నాయి. మరో పక్క దేశ భక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోజుకొక్క పథకం, పూటకొక్క నినాదంతో మోడీ ప్రచార దాడిని కొనసాగిస్తున్నాడు.

కార్పోరేట్ కళ్యాణ్ యోజన అనేదే అసలైన మోడీ పథకం. వరవరరావు, సాయిబాబా, అనంద్ తేల్ తుంబ్లే, సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, వెర్నెస్ గొంజాల్వేస్,రోనా విల్సన్, సురేంద్రర్ గాడ్లింగ్, షోమా సేన్, గౌతమ్ నవలఖా, సుధీర్ దాన్లే, మహేష్ రావుత్ వంటి ఇతర ప్రముఖులను జైళ్ళలో నిర్భందించినందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ ప్రభుత్వానికి ముయు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి.

మరోక వైపున 2022 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని, కేవలం కార్పోరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే న్యూ ఇండియాను నిర్మిస్తామని పెట్టుకున్న లక్ష్యం కూడా నెరవేరటం లేదు. సమాధాన్ దాడిని తట్టుకొని, నిలబడి తెలంగాణ, ఇతర ప్రాంతాలల్లో మా శక్తులు బలపడుతున్నాయి.

ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి దేశాల మధ్య సాయుధ పోరాట సంస్థలతో కాల్పుల విరమణను ప్రకటించి, అందరూ ఐక్యంగా కొవిడ్-19ను ఎదుర్కోవాలని చేసిన విజ్ఞప్తిని కూడా మోడీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కొవిడ్-19 ప్రబలుతున్న కాలంలో కూడా అత్యంత రాక్షసంగా మోడీ ప్రభుత్వం, అయా రాష్ట్ర ప్రభుత్వాలు మా పై చేపట్టిన మిలటరీ క్యాంపెయిన్లు విఫలమయ్యాయి.

పీడిత ప్రజలను ఆదుకునేది మేమే

ఈ పరిస్థితుల్లో దేశంలో మావోయిస్టు పార్టీ ఒక్కటే ప్రత్యమ్నాయమని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంక్షిప్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, ప్రజల సమస్యలు పెరిగిపోయి, పార్లమెంటరీ వ్యవస్థలన్నీ ఫాసిస్టు సంస్థలుగా మారిపోయి, రాజ్యాంగ కోవిదులు, ప్రముఖులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మరియు పీడిత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించటానికి తయారవుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం ఇంటా, బయట అన్నీ రంగాలల్లో పూర్తిగా బ్రష్టు పట్టింది.

మోడీ ప్రతిష్ఠ ఘోరంగా దిగజారింది. ఈ పరిస్థితుల్లో కార్పోరేట్లలో విశ్వాసాన్ని పెంచటానికి, ప్రజల్లో మా పట్ల ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీయటానికి ఇటువంటి హై టెంక్షన్ కట్టుకథలను మోడీ ప్రభుత్వం అల్లింది. కామ్రేడ్ గణపతి వయసు, చిన్న చిన్న అనారోగ్య సమస్యల రీత్యా స్వచ్ఛందంగా కార్యదర్శి బాధ్యత నుండి తప్పుకొని ఇతరులకు అప్పగించాడు.

 ప్రపంచ చరిత్రలోని పోరాట సంస్థలలో ఇటువంటి మార్పులు సహజమే. సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా, పటిష్టంగా ఉండి పాలక వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకత్వపు ప్రతిష్ఠను అంతర్జాతీయంగా కూడా దెబ్బ తీయడానికి ఇటువంటి కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాల విశ్వసనీయత ఏనాడో మట్టికొట్టుకు పోయింది.

గణపతి లొంగిపోవడం కట్టుకథే

ప్రభుత్వాలు, ఇంటలిజెన్సీ సంస్థలు తయారు చేసిన ఇటువంటి కట్టుకథలను మీడియా ప్రచారం చేయటం ద్వారా దీని విశ్వసనీయత మరింత దిగజారింది. కార్మికులు, రైతాంగం, పెట్టిబూర్జువా సెక్షన్లు సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు, ప్రజాస్వామిక వాదులు, దేశ భక్తులు, ప్రగతిశీల శక్తులు ఇంకా ఇతర పీడిత సెక్షన్లు ఈ ప్రభుత్వాల దుర్మార్గ కుట్రలను అర్థం చేసుకొని తిప్పికొట్టవలసిందిగా కోరుతున్నాం.

ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా కోరుతున్నాము. చివరిగా, మరొక సారి మోడీ, ఇంటలిజెన్సీ సంస్థల అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫాసిస్టు పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఇనుమడించిన ఉత్సాహంతో, దృఢ దీక్షతో, అమరుల ప్రేరణతో తీవ్రంగా పోరాడుతూ పాలక వర్గాల దుర్గాలను ధ్వంసం చేస్తూ ముందుకు పోతామని ప్రకటిస్తున్నాం.

ఎంతో అనుభవం కలిగి, నిస్వార్ధ, సిద్ధాంత, రాజకీయ పటుత్వం కలిగిన మా కేంద్ర కమిటీ నాయకత్వంలో ఉద్యమాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు తీసుకుపోతామని, అంతిమ విజయం సాధిస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నాం.

-విప్లవాభినందనలతో, అభయ్, అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Related posts

సిద్దిపేట‌లో టీ హ‌బ్ ఏర్పాటు

Bhavani

పవన్ కల్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తుల నిఘా

Satyam NEWS

ఇంట్లోకి దూసుకొచ్చిన ఉడుము

Satyam NEWS

Leave a Comment