గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాన్నివేగవంతం చేయాలని, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఏఇలు క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవ పరిస్థితిని తెలుసుకొని తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న డిజిటల్ లైబ్రరీలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంపై మండలాల వారీగా, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మహేష్ మాట్లాడుతూ, పలు చోట్ల భవనాల నిర్మాణం నేటికీ ప్రారంభం కాకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్లను ఖరారు చేయాలని ఆదేశించారు.
అధికారులు ఇచ్చిన నివేదికల్లో తప్పులుండటం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ, వాటిని సరిదిద్ది ఖచ్చితమైన నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. ఎఇలు గ్రామాల్లో పర్యటించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని, సర్పంచ్లను, సచివాలయ సిబ్బందిని కలవాలని సూచించారు. ఇసుక సరఫరాలో ఇబ్బందులు తొలగిస్తామని, సిమ్మెంటును గృహనిర్మాణశాఖ నుంచి తీసుకొని సరఫరా చేస్తామని, బిల్లులు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని జెసి హామీ ఇచ్చారు. ప్రతీ రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని, పనుల్లో పురోగతి ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయితీరాజ్ సూపరింటిండెంట్ ఇంజనీర్ బిఎస్ రవీంద్ర, విజయనగరం ఇఇ కెజెఎస్ నాయుడు, పార్వతీపురం ఇఇ వై.విజయ్కుమార్, డిఇలు, జెఇలు, ఏఇలు పాల్గొన్నారు.