ఖరీఫ్ సాగుకు రైతులను సన్నద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పంటల సాగుపై ప్రభుత్వానికి కనీసం ప్రణాళిక కూడా లేదని ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు.
అన్నదాతలకు అవసరమైన అన్ని రకాల సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే భిన్నంగా కనిపిస్తోందని అన్నారు. రైతులు అడిగే విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో లేక అలంకారప్రాయంగా మారాయిని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన రకాలేవీ ఆర్బీకేల ద్వారా ఇవ్వడం లేదని.. ఇచ్చిన కాసిన్ని కూడా అధికార పార్టీకే చెందిన వారికే అందుతున్నాయని.. రైతులు నల్లబజారులో అధిక ధరలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రత్తిపాటి అన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు అరకొరగా విత్తనాలు, ఎరువులు అందించడం మినహా రైతులకు ఉపయోగపడే సేవలేవీ అందడం లేదని తెలిపారు. సాగు సమయానికి విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేనప్పుడు రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనం ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు.
క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణనే ప్రభుత్వం గాలిగొదిలేసిందని.. రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు, పథకాలపై అవగాహన కూడా కల్పించలేకపోయారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు.
సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు రైతులకు కావాల్సిన విత్తనాలకు డిమాండ్ ఉంటుందని.. అవసరమైన వాటిని అందించలేకపోతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. డిమాండ్ను బట్టి వ్యాపారులు సీజన్లో విత్తనాలు, ఎరువుల ధరలు ఆమాంతం పెంచేస్తున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని… రైతులకు అవసరమయ్యే విత్తన రకాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.