శ్రీకాకుళం – ఆమదాలవలస రోడ్డు విస్తరణ కోసం బిజెపి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్ర్చర్ ఫండ్ నుండి నలభై కోట్ల రూపాయలు 2018 లోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే, నేడు జిల్లా మంత్రి ధర్మాన ప్రసాద రావు, తామే కొత్తగా నిన్న 40 కోట్ల రూపాయలు మంజూరు చేసామని చెప్పడం, ఆయన స్థాయికి సరికాదని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీ ఇంఛార్జ్ చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు. తాను, ఇతర బిజెపి నాయకులతో కలిసి నిరంతరం అధికారుల దృష్టికి, లక్షలాది మంది ప్రజల దృష్టికి తీసుకొచ్చి, వత్తిడి పెంచడం మూలంగా, నిన్న చుట్టపు చూపుగా రోడ్డు పరిశీలించి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. ప్రజలందరికీ ఈ విషయంలో పూర్తి అవగాహన కల్పించామని తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడితే సెంట్రల్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని, కేంద్రం నిధులు దుర్వినియోగం అయితే చూస్తూ ఊరుకోమని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం రోజుకు 17 కి. మీ. లెక్కన రోడ్లు నిర్మిస్తుంటే, నిధులిచ్చినా కూడా 10.4 కి.మీ.రోడ్డు వేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులిచ్చినా పూర్తి కాని ప్రాజెక్టులన్నింటిపైనా దృష్టి పెట్టాలని చల్లా వెంకటేశ్వర రావు కోరారు.