టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన దొంగలను మంత్రి కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేసారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ నెల 18 న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే నిరుద్యోగుల గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ పై కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా రేవంత్ రెడ్డితో కలిసి నిరసన దీక్ష చేపట్టామన్నారు.
కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదం మాత్రమే అని అసలైన దొంగలను కాపాడే ప్రయత్నం చేశారని తెలిపారు. పేపర్ లీకేజీ వెనక పెద్ద కుట్ర ఉందని, కమిషన్ చైర్మన్ బోర్డ్ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ విచారణకు ముందే ఇద్దరు వ్యక్తులే పేపర్ లీకేజీ చేశారని ప్రకటించిన తర్వాత సిట్ కూడా అదే నివేదిక ఇస్తుందనో, నిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో కాని సిబీఐతో కాని విచారణ జరిపించాలన్నారు.
ఈ నెల18 న తలపెట్టిన ఇందిరాచౌక్ వద్ద నిరుద్యోగ గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెఎసి కన్వీనర్ జగన్నాథం, టీజేఏసీ జిల్లా అధ్యక్షులు రమణ, టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, బీఎస్పీ నాయకులు బాలరాజు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.