కొల్లాపూర్ రాజావారి కోటలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వం స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. కొల్లాపూర్ కోటను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న రాజా ఆదిత్య లక్ష్మణరావుకు ఇది ఎదురుదెబ్బ. కొల్లాపూర్ కోటను చారిత్రక స్థలంగా పరిగిణించేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన పోరాటం నెగ్గినట్లయింది. కొల్లాపూర్ కోట ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని యథాతధ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నేడు ఈ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. కొల్లాపూర్ కోట చుట్టూ మూడు వైపులా ఉన్న ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మునిసిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కొల్లాపూర్ మునిసిపల్ కమిషనర్ కు కూడా ఈ ఆదేశాలను పంపించారు. దాంతో కొల్లాపూర్ కోట లో ప్లాట్లు చేసి అమ్ముకున్న రాజాకు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది ఎదురు దెబ్బ. చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న కొల్లాపూర్ కోటను కాపాడాలని ప్రయత్నం చేస్తున్న జూపల్లి కృష్ణారావు ఈ ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు. రేపు ఉదయం ఈ ఆదేశాలను కొల్లాపూర్ మునిసిపల్ కమిషనర్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ ఈ ఆదేశాలను అమలు చేయని పక్షంలో ప్రజలు నిలదీసి అడగాలని, కొల్లాపూర్ కోటను స్వార్ధ పరుల నుంచి రక్షించాలని జూపల్లి కృష్ణారావు కోరారు. కొల్లాపూర్ మునిసిపల్ అధికారులు తక్షణమే అక్కడి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కొల్లాపూర్ కోట మూడు వైపులా ఉన్న భూమిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని ఈ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినందున తక్షణమే చర్యలు తీసుకోవాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
previous post