దిశ చట్టం తీసుకువచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యాచారాలను ఆపలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మాజీ ఎంఎల్ ఏ కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. జగన్ తెచ్చిన చట్టం అంటే ఎవరూ భయపడటం లేదని అందరూ తేలిగ్గా తీసుకుంటున్నారని ఆమె అన్నారు. తాజాగా నెల్లూరు నగరంలో మతి స్థిమితం కోల్పోయిన ఒక మహిళపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తెలిపారు. అతి కిరాతకంగా నెల్లూరు నగరంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉందో, దిశ చట్టం అంటే ఎంత భయం ఉందో అర్ధం అవుతున్నదని ఆమె అన్నారు. దిశ చట్టం తీసుకురావడం పట్ల చిత్తశుద్ది ఉంటే తక్షణమే నెల్లూరులో జరిగిన ఈ ఘోరానికి కారణం అయిన వారిని పట్టుకుని 21 రోజుల్లోగా మరణ శిక్ష విధించాలని కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు.