గీత కార్మికులు కొందరు కల్లు లో యూరియా కలిపి విక్రయిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ వ్యాఖ్యానించడంపై గౌడ సంఘం నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయాన్ని నిరూపించాలని లేకపోతే గౌడ జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకోండి లేని పోని వ్యాఖ్యాలు ఎందుకని వారు ప్రశ్నించారు. కల్లు కల్తీని తామూ ఎప్పుడూ వ్యతిరేకిస్తామని కల్తీ అడ్డం పెట్టుకుని కల్లుగీత వృత్తిని కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప్పు , పసుపు, నూనె, పాలు, బీరు, మందు, చివరకు పరిపాలనలో కూడా ప్రజలకు పనికొచ్చే ప్రతి వస్తువులో కల్తీ ఉంది.
అటువంటి కల్తీని చేతైతే నిర్మూలించాలని సవాల్ విసిరారు. వైన్స్ మాఫియా కోసం తమను బదనాం చేయవద్దని కోరారు. గీత కార్మికుల కష్టం దినదిన గండంగా మారిందని వాళ్ల గోస వర్ణనాతీతమనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచైనా కల్తీ వ్యాఖ్యలు మానుకొని గౌడ జాతికి క్షమాపణ చెప్పాలని లేదంటే ఎమ్మెల్యేను అడ్డుకుంటామని కల్వకుర్తి తాలూకా గౌడ సంగం హెచ్చరించింది.