మనిషిలో ఉన్న మానవత్వాన్ని, దాతృత్వాన్ని కరోనా వైరస్ నిద్ర లేపుతుందని స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి అన్నారు. నకెరికల్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న నిరుపేద ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ ఆంటోనీ అతని మిత్రులు సోమవారం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిన కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అభినవ్ గెహైక్వాడ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.
కరోనా నివారణలో భాగంగా నిర్వహించబడుతున్న లాక్ డౌన్ తో అన్ని రంగాల ఉద్యోగులు ఆర్ధికంగా కుంగిపోతూ, కుటుంబ పోషణ భారంగా మారిందని ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు సహృదయంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడం ఒక వైపు, అభాగ్యులను ఆదుకునేందుకు మరో వైపు సేవకులు ముందుకు వస్తుండడం సమాజ మార్పుకు ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
పోలీసుల సహకారం అభినందనీయం
అభినవ్ గెహైక్వాడ్ మాట్లాడుతూ నిరుద్యోగులుగా ఉంటూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారిని ఆదుకునే ఆలోచన రావడం గొప్ప విషయమని అన్నారు. కరోనా కట్టడిలో పట్టణ ప్రజలు పోలీసులకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. మరి కొన్ని రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, వివిధ పాఠశాలల వ్యవహర్తలు ఎండి జమీరొద్దీన్, ఎన్ ఎఫ్ సుందర్ రాజ్, గట్టు అలెగ్జాండర్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.