ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ఎత్తుగడ చాలా దుర్మార్గం గా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జిఒలు మాకు వద్దు. ఈ పీఆర్సీని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని బండి శ్రీనివాసరావు ప్రకటించారు. తమ హక్కుల ను దెబ్బ తీసేలా జగన్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. గ్రాట్యుయిటీ పై 16లక్షల సీలింగ్ ఎత్తి వేయడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు.
గతంలో మేము పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా అంటూ ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. ఐదు డిఎ లు పెంచామని చెప్పి… ఇతర వాటిలో కోత విధించడం అన్యాయమని ఆయన తెలిపారు. సిఎం అడగకుండానే ఇచ్చారంటూ ఇప్పుడు కోత విధించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పిఆర్సీ 23శాతం, ఇతర డిఎలు ఇస్తాం అన్నారు. ఇతర అంశాలను సి.యస్ తో మాట్లాడాలని సూచించారు.
ఐ.ఆర్ కన్నా తక్కువ వేతనాలు బాధ కలిగించింది. హెచ్.ఆర్.ఎ ను కూడా తొలగించారని ఆయన అన్నారు. రేపు, ఎల్లుండి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరును ఎండగడతామని ఆయన అన్నారు. అవసరమైతే సమ్మె బాట పడతామని శ్రీనివాసరావు ప్రకటించారు. 11వ పిఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జిఒలను వ్యతిరేకిస్తున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
నిన్నటి రోజును ఉద్యోగులు, ఉపాధ్యాయలకు చీకటి దినంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయతీలు రద్దు చేయడం ఒక రికార్డు. గతంలో ఎవ్వరూ ఇలా రద్దు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం పేరు చెప్పి కొత్త నిబంధనలు అమల్లోకి ఎలా తెస్తారు. 11పిఆర్సీ అమలుకు..కేంద్రం విధానాలకు ఎలా ముడి పెడతారు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ లేదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం అన్యాయం చేసినందువల్లే సమ్మె వైపు ఆలోచన చేస్తున్నామని ఆయన ప్రకటించారు.