కోవిడ్ – 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ అమలవుతున్న క్రమంలో అనాధలు, పేద ప్రజలు, యాచకులకు కొందరు పోలీస్ కానిస్టేబుల్స్ స్ఫూర్తివంతంగా నిలిస్తూ ఆపన్నహస్తం అందిస్తుండగా పలువురు దాతలు వారికి బాసటగా నిలుస్తున్నారు.
నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏ.ఆర్. విభాగంలో పని చేస్తున్న హఫీజ్, సైదులు, కరుణాకర్, జగదీష్ లు చేస్తున్న సేవలకు ట్రైనీ ఐపిఎస్ వైభవ్ గైక్వాడ్, జిల్లా ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్, కెనడాకు చెందిన శ్రీహరి, అతని అయిదు ఏళ్ల కుమారుడు అభిరామ్ తో పాటు పలువురు చేయుతనందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
తాజాగా మంగళవారం రోజున వి.నర్సింహ రెడ్డి ARSI తన తల్లి ప్రధమ వర్ధంతి సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ యందు 10,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కె.జంగయ్య ARSI – తెలంగాణ స్టేట్ పోలీస్ అసోషియేషన్ కో-ఆప్షన్ మెంబర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జమాల్, పోలిస్ కళా బృందం ఇంచార్జ్ హుస్సేన్ పాల్గొన్నారు. మిత్రులు, దాతల సహకారంతో వితరణ కార్యక్రమాలు లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగిస్తామని కానిస్టేబుల్స్ తెలిపారు.