రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అమరావతి రైతుల యాత్రను రాష్ట్ర హోం మంత్రి తానేతి వనిత అభివర్ణించారు. ఇప్పటి వరకూ చాలా మంది మంత్రులు స్పందించారు కానీ హోం మంత్రి స్పందించలేదేమాటా అనుకున్న వారికి హోం మంత్రి ఆ లోటు తీర్చారు. రైతుల పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న యాత్రను ప్రజలు తిరష్కరిస్తున్నారని హోంమంత్రి అన్నారు. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకులే యాత్ర చేస్తున్నారని హోం మినిస్టర్ అన్నారు. యాత్ర చేస్తున్న వారు ఎక్కడికి వెళ్లినా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజలను, పోలీసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. పచ్చ మీడియా లో పబ్లిసిటీ కోసమే అమరావతి యాత్ర సాగుతోందని అన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని హోంమంత్రి గుర్తు చేశారు.