బంధువని నమ్మి వెంట వచ్చిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఈ దారుణం జరిగింది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది.
ఆ అమ్మాయి తల్లి ఇటీవలే మృతి చెందడంతో అమ్మాయి బాగోగులు చూసుకుంటానని చెబుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముండే అదే వర్గానికి చెందిన ఓ టిఆర్ఎస్ నాయకుడు ఆసీఫ్ ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఆసీఫ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు.
తల్లి ఇటీవలే మృతి చెందడంతో అమ్మాయికి మేన మామ వరుస అయిన ఆసీఫ్ అమ్మాయి బాగోగులు చూసుకుంటు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని తెలిపారు.రెండు రోజుల క్రితం అమ్మాయిని కామారెడ్డికి తీసుకువచ్చి ఓ చోట బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని, అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు.
అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని గగంబిరావుపేటలో వదిలేసి వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.