ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటి (ఎంసిఎంసి) జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, ఎంసిఎంసి కమిటీ చైర్మన్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటి సమావేశాన్ని జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిటి సభ్యులు నిరంతరం వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ ఛానల్ లు, సోషల్ మీడియా, వాట్సప్ ఛానల్ ,ఈ పేపర్, ఇతర ప్రసార మాధ్యమాలలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు.
మోడల్ కోడ్ ఉల్లంఘించే లా ప్రకటనలు, పోస్ట్ లపై రిటర్నింగ్ అధికారి ద్వారా నోటీస్ జారీ చేసి చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టర్ లు, కరపత్రాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచురణ చేయాలని అన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, సభ్యులు జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, జిల్లా సహకార శాఖ అధికారి విజయ కుమారి అదనపు పౌర సంబంధాల అధికారి వల్లోజి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు బి.వి.ఆర్.ఆర్.పి. ఫణికుమార్, తాళ్ళూరి మురళీకృష్ణ పాల్గొన్నారు.