బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతాన్ని ఎగతాళి చేస్తూ బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే ఈ సంఘటన జరగడంతో ఒక్క సారిగా హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దాంతో నేడు బాసర బంద్ చేశారు. ఉద్యోగులు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలిపారు.
అమ్మవారిపై నీచ వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి పీడీ ఆక్ట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాసర ఆలయ అర్చకులు,వేదపండితులు పరిపాలనా సిబ్బంది కలిసి, ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో అతని పై ఫిర్యాదు అందజేశారు.
వీరికి మద్దతుగా కులమతాలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఒకే చోటుకు చేరుకుని తమ నిరసనను చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యాసంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి రోడ్డుపై బైఠాయించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కించపరిచే విధంగా మాట్లాడిన రెంజర్ల రమేశ్ అనే వ్యక్తి ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ బైంసా వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న శివాజీ చౌక్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దీంతో ప్రధాన రోడ్డు మార్గాన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం హిందూ సంఘాలు,రాజకీయ నాయకులు పలువురు కలిసి పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు.