రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 9 మెడికల్ కాలేజీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు విద్యార్థులకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, అందులో మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకుముందే ఉన్నాయని పేర్కొన్నారు.
తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని తెలిపారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 3,915కు చేరిందని వివరించారు.
నిరుడు ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్టు గుర్తు చేశారు. 15 న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డిని మంత్రి ఆదేశించారు.