వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై కష్టడీలో దాడి జరిగినట్లు ఖరారు అయింది. రఘురామ బెయిల్, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యుల అందించిన నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ చెప్పారు.
వైద్య పరీక్షల నివేదికను తమకు కూడా ఇవ్వాలని రఘురామ తరపు న్యాయవాది ఆదినారాయణ కోరడంతో ఆయన దాన్ని తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్రే, వీడియో కూడా పంపారని న్యాయమూర్తి తెలిపారు. రఘురామకృష్ణరాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ వినీత్ శరన్ అన్నారు.
దాంతో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ తమ ఆరోపణలు నిజమని తేలాయని అన్నారు. రఘురామను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని తాము కోర్టు దృష్టికి తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఎంపినా కాదా అనేది తాము చూడమని, ఎవరికి ఇలా జరిగినా స్పందిస్తామని కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాది దవేను ప్రశ్నించింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది.