గరుడ వారధి పనులను సకాలంలో పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి తిరుపతి నగర ప్రజలను గట్టెక్కించాలని కాంగ్రెస్ నేత, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్మార్ట్ సిటీ ఎలివేటెడ్ కారిడార్ కు గరుడ వారధి లేక శ్రీనివాస సేతు అన్న నామకరణం చేయడంలో స్థానికులకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ సమన్వయంతో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని నామకరణం చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
తిరుపతి ప్రజల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం టీటీడీ 450 కోట్లు, నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ 234 కోట్లతో కలిపి సంయుక్తంగా 684 కోట్ల నిధులతో ఆరు కిలోమీటర్ల పొడవుతో ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు నత్తనడకన కొనసాగడంతో స్థానిక ప్రజలు యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
నగరపాలక సంస్థ అధికారులు, మేయర్,కార్పొరేటర్లు అధికార పార్టీ నాయకులు తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ధర్మకర్తల చైర్మన్ తో ప్రత్యక్షంగా వెళ్లి చర్చించి నిధుల విడుదల పై దృష్టి సారించి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిసారించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్మార్ట్ సిటీ ఎలివేటెడ్ కారిడార్ అగ్రిమెంటు ప్రకారం పనులు పూర్తి చేయవలసిన గడువు ముగిసినా నిధుల లేమితో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి పూర్తిగా టి.టి.డి నిధుల కేటాయింపుపై ఫ్లైఓవర్ పనులు ఆధారపడి ఉందని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాకముందే నగరపాలక సంస్థ సమావేశంలో “శ్రీనివాస సేతు” అన్న నామకరణం పై తీర్మానం చేయడం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు.