నిన్న మొన్నటి వరకూ అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన మరో సీనియర్ ఐపిఎస్ అధికారిపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. 1990 బ్యాచ్ కి చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయనను అక్కడ నుంచి అకస్మాత్తుగా బదిలీ చేసి మంగళగిరిలోని ఎపిఎస్ పి బెటాలియన్స్ అదనపు డిజిపిగా పోస్టింగ్ ఇచ్చారు.
ఆర్టీసీ నుంచి రిలీవ్ అవుతున్న సమయంలో అంటే 13వ తేదీన ఆయన ఆర్టీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను ఎంతో క్రమశిక్షణతో, నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. ఎక్కడా సొంత ఇల్లు కూడా లేని ఐపిఎస్ అధికారినని ఆయన అన్నారు.
వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తాను చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించానని ఎక్కడా ఎలాంటి మచ్చా లేకుండా పని చేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా తాను నిర్వర్తిస్తానని తనకు ఎలాంటి ప్రాధాన్యతలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయన షోకాజ్ నోటీసును జారీ చేసింది. వారం రోజుల్లో ఈ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొన్నారు.
ఆర్టీసీ నుంచి బదిలీ చేసి అదనపు డిజిపిగా బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆయనను అక్కడ నుంచి కూడా తప్పించారు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా కోరారు. ప్రతాప్పై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారంలో సమాధానం చెప్పాలని సీఎస్ ఆదేశించారు.