బీసీ ముఖ్యమంత్రి నినాదం పని చేస్తుందో లేదో కానీ తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొన్నది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ఈ కొత్త నినాదంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆ విషయం ప్రకటించిన నాటి నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్గం యాక్టీవ్ అయిపోయింది. కరీంనగర్ ఎంపిగా ఉన్న ఆయన ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
బీసీ అభ్యర్ధి ముఖ్యమంత్రి అనగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గం నీరస పడిపోయినట్లు చెబుతున్నారు. అందుకే ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం లేదని కూడా అంటున్నారు. పార్టీ అధ్యక్షుడుగా ఉండి శ్రమ పడ్డా కూడా ఫలితం లేదనే నిరాశ వారిని వెన్నాడుతున్నది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో హైదరాబాద్ లో మీటింగ్ పెడుతున్నారు. ఎలాగైనా తెలంగాణలో ప్రభావం చూపాలని కనీసం ఇరవై సీట్లలో అయినా గెలిచి హంగ్లో కింగ్ అవ్వాలని బీజేపీ అనుకుంటోంది. బీసీ సీఎం నినాదం అందుకోసమే. ఇప్పుడు ఏకంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
బండి సంజయ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బండి సంజయ్ ను బీజేపీ చీఫ్ గా తప్పించడం పార్టీకి చాలా డ్యామేజ్ అయింది. అయితే ఆయనను తప్పించడం వెనుక కుట్రలేమీ లేవని.. బీ సీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకునేందుకు ఆయనకు కీలక పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ కూడా ప్రచారానికి కేటాయించారు.
ఆయనను మాస్ లీడర్ గా గుర్తిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు. బీసీని సీఎంను చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆయననే అభ్యర్థిని చేస్తామని మోదీ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బీసీలు ఏకపక్షంగా మద్దతు పలుకుతారన్న భావనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో పొత్తు కలసి వస్తుందని అంచనాల్లో ఉన్నారు.
ప్రధాని మోదీ హాజరు కాబోయే బీసీ ఆత్మగౌరవ సభ కు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు. బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా .. రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.