ఇప్పటి వరకూ తెర వెనుక కలసి పని చేసినట్లు కనిపించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇక బహిరంగ విమర్శలకు దిగినట్లు కనిపిస్తున్నది. బిజెపి గత కొద్ది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు చేస్తూ ఉద్యమాలు నడుపుతున్నా కూడా వైసిపి నాయకులు నోరు మెదపలేదు.
బిజెపిని కాకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించే వారు. జనసేన పార్టీ నాయకుడిని విమర్శించే వారు. ఇప్పుడు ఆ విభజన తొలగిపోయినట్లు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడగవద్దు జగన్ అంటూ నేరుగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు చెప్పినా కూడా ప్రత్యేక హోదా కావాలంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఏపీకి అడుగడుగునా అన్యాయమే జరిగిందంటూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు.
పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను, ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిందని రాజ్యసభలో విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా మొదలుకుని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వలన రాష్ట్రానికి వాటిల్లే నష్టం ఆయన ఆన్ రికార్డు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్కు నిధుల విడుదల, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ తరలించే ప్రయత్నాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, సవతి తల్లి వైఖరిని ఆయన ఎండగట్టారు. రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారడానికి ఇది సంకేతమా?