గుంటూరు జిల్లా గురజాల డివిజన్ లోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో 8,762 ఇళ్ల గ్రౌండింగ్ కు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఇన్చార్జి సబ్ కలెక్టర్, గురజాల ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వలన పేదవాడి సొంత ఇంటి కల సాకారం అయ్యే రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గురజాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న హౌసింగ్ గ్రౌండ్ మేళాను ఆర్ డి ఓ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆర్ డి ఓ మీడియాతో మాట్లాడుతూ గురజాల డివిజన్ పరిధిలో గ్రౌండ్ మేళాలలో 100% లక్ష్యం సాధన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడమే గాక, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వమే భరించడం ఈ స్కీం ప్రత్యేకత అని ఆర్డీవో పేర్కొన్నారు. గురజాల డివిజన్ పరిధిలోని మున్సిపాలిటీలలో (దాచేపల్లి 1587, గురజాల 1332, పిడుగురాళ్ల అర్బన్ 832, మాచర్ల అర్బన్ 5007)
ఇళ్ల స్థలాలు మంజూరైనట్లు ఆర్డీవో తెలిపారు. ఇంటి స్థలం మంజూరైన ప్రతి లబ్ధిదారుడు సొంత గృహం నిర్మించుకునే విధంగా ప్రోత్సహించేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు ఆర్డీవో చెప్పారు.
డివిజన్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో పర్యటించి సొంత ఇల్లు నిర్మించుకోవలసిన ఆవశ్యకతపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆర్డీవో పార్థసారథి వివరించారు.