సమాజం కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు.
శనివారం బాలయ్య శాస్త్రి లేఔట్ లో పలువురు జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు గంట్ల శ్రీనుబాబు తన సొంత నిధులు తో నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి క్రమేపి పెరుగుతుంది.
మరో వైపు లాక్ డౌన్ నేపథ్యంలో పలువురు జర్నలిస్ట్ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ఇప్పటికే 70 మంది జర్నలిస్టులకు తొలివిడత గా సామాగ్రిని అందచేశానని చెప్పారు. మరో 120 మందికి నేడు 10 కేజీ లు బ్రాండెడ్ బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ ఆయిల్ ప్యాకెట్ ను అందచేశామన్నారు.
ఈ ప్రక్రియ దశల వారీగా కొనసాగుతోందని తెలిపారు. వెబ్ న్యూస్ ఛానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కూడా సామాగ్రి అందిస్తామన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకోవాలని ఆయన కోరారు. తమిళనాడు తరహాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు నగదు పంపిణీ చేపట్టాలని అన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల భీమా లో జర్నలిస్టులను చేర్చాలని కోరారు. నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు జర్నలిస్టులకు సహాయం చేయాలని కోరారు. కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు కూడా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా గంట్ల శ్రీను బాబు జర్నలిస్టులకు సూచించారు.