జర్నలిస్టుల మధ్య అనైక్యత కారణంగా సమస్యలు మరింత పెరుగుతున్నాయని నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మురహరి బుద్ధారం అన్నారు. అధికారంలో ఉన్న మంత్రులపై, ఎమ్మెల్యేలపై ఎవరైనా జర్నలిస్టులు వార్తలు రాస్తే వాటికి ఖండనలను మరి కొందరు జర్నలిస్టులు రాస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు సిండికేట్ గా మారి వారికి మామూలు ఇచ్చే నాయకులపై, అక్రమార్కులపై, తప్పుడు మార్గంలో వెళ్లే అధికారులపై వాస్తవిక కథనాలు రాసే జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాటి జర్నలిస్టుల వాస్తవ కథనాలపై జర్నలిస్టులే తప్పుడు ప్రచారాలు చేస్తూ కేసులు పెట్టే అంశంలో ఈ సిండికేట్ ముఠాలు ముందు వరుసలో నిలబడుతున్నాయని ఆయన అన్నారు.
కేవలం తమ పబ్బం గడుపుకోవడానికి నిజమైన, నిజాయితీపరులైన జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇకనైనా చిన్న పత్రికలలో, చిన్న ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టులు ఐక్యతను చాటుకుని ఇటువంటి సిండికేట్లు చేసే అక్రమాలను వెలుగులోకి తెచ్చినట్లు అయితే సిండికేట్ల చరిత్ర మటుమాయమై ఎటువంటి అక్రమాలకు అవకాశం ఉండదని ఆయన అన్నారు. అదేవిధంగా కొందరు అధికారులు మామూళ్ల మత్తులో ఊగుతూ జర్నలిస్టులు ఏదైనా అక్రమంపై ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారి పేర్లు వారి ఫోన్ నెంబర్ అక్రమార్కులకు తెలియజేసి ఏమీ తెలియని నంగనాచుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఇటువంటి చర్యల పై కూడా జర్నలిస్టులు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే వారి భరతం పట్టడం పెద్ద అంశం ఏమీ కాదని మురహరి అన్నారు. అలాగే కొందరు పోలీసు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని వారిపై అనేక విధాలుగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిజం చేయడమంటే కత్తి మీద సాములాంటిదని ఆయన అన్నారు. అందువల్ల జర్నలిస్టులు చేసే ప్రతి పనికి, ప్రతి వార్తకు, ప్రతి కథనానికి, సరి అయిన ఆధారాలతో నిక్కచ్చి జర్నలిజాన్ని చూపుతూ ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్