తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియా, కొన్ని న్యూస్ చానల్స్ లో వస్తున్న వదంతులలో ఎలాంటి నిజం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు.
తన జీవితం ఉన్నంత వరకు టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, సిఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తినని ఆయన అన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాదిగా రాష్ట్ర సాధనలో భాగంగా మూడున్నర ఏళ్ల మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగు వేసి పొరాడానని ఆయన తెలిపారు.
కుటుంబంలో చిన్న చిన్న ఆటుపోట్లు సహజమేనని మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికంగా వచ్చిన కొన్ని విభేదాల వల్ల మాకు సంబంధించిన వారే పోటీ చేశారని వారంతా తెలంగాణ కోసం పోరాడిన వారేనని జూపల్లి అన్నారు. కొల్లాపూర్ లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో తన వెంట 20 ఏళ్లు ఉన్న వాళ్లను ప్రజలు ఆదరించారని జూపల్లి తెలిపారు.
నిబద్ధత తో ప్రజల కోసం జీవిస్తూ రాజకీయాలు చేస్తూన్నానని ప్రజల కోసమే జీవిస్తానని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు దండు నరసింహ పాల్గొన్నారు.