పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక్ను ఆమోదించింది. లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అయేషా మాలిక్ – పాకిస్తాన్ తన మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం విశేషం.
లాహోర్లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా(PCL)లో ఆమె లా చదువుకున్నారు. ఆ తర్వాత లండన్లోని హార్వర్డ్ లా స్కూల్లో లాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
పాకిస్థాన్లోని పలు హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్లలో ఆమె సేవలందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్(IAWJ) లోనూ సభ్యురాలిగా ఉన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో జస్టిస్ ఆయేషా మాలిక్ చారిత్రక తీర్పులు ఇచ్చారు.
కన్యత్వ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని సంచలనంగా మారారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్గా ఓ మహిళ నియమితులు కానుండటం ఓ మంచి వార్త అంటూ డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. పాకిస్థాన్లో మహిళా హక్కుల ఉల్లంఘనపై తరచూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఓ మహిళ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్గా నియమితులు కావడంతో అంతర్జాతీయ మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.