కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరతీశారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. కేంద్ర హోంశాఖకు మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అసత్యాలు చెబుతున్నారని, నిమ్మగడ్డ లేఖపై డీజీపీకి చేసిన ఫిర్యాదులో టీడీపీ ఆఫీస్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్, తన పేరును విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో ప్రస్తావించారని కనకమేడల తెలిపారు. ఆ లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ డ్రాఫ్టింగ్ తనది కాదని ఆయన అన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద విజయ సాయి రెడ్డి నేరం చేశారని, విజయసాయి రెడ్డి ఫిర్యాదు దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆయన ప్రకటించారు.