మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. కొరటికల్ గ్రామంలో మంత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలియదిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. జనంతో మమేకమవుతూ కష్టసుఖాల్లో ఇంటి పార్టీగా టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసాను అందిస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ప్రజలు ఓటేసి గెలిపించేది వారి సమస్యల పరిష్కారం కోసమేనని, సొంత పనుల చక్కదిద్దుకోవడానికి కాదని విమర్శించారు. మునుగోడు ప్రజల కోసం కాకుండా, తన సొంత కాంట్రాక్టుల కోసం పనిచేస్తానని తానే చెప్పుకుంటున్నాడని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటెయ్యాలన్నారు.
చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే అని చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బడ్జెట్ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు మరింత బలంగా కొనసాగాలంటే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, నేతన్నల భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మారుస్తున్న భారతీయ జనతా పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.