నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం నర్సాయపల్లి గ్రామపంచాయతీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న గ్రామస్తుల డిమాండ్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అంగీకరించారు. నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో రెండు గంటలకు పైగా కూర్చొని గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కృషి చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గ్రామ సర్పంచ్ కొమ్మ సత్యనారాయణ యాదవ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను విని, వివిధ శాఖల ఉన్నతాధికారులతో అప్పటికప్పుడు మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం వారిని ఆదేశించారు.
నర్సాయపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి వెడల్పు త్వరగా చేయాలని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల వారు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు కోల్పోయే వాళ్లకు ప్రభుత్వం నుండి నష్టపరిహారంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో కాలువల ద్వారా నీరు అందని పంట పొలాలను గుర్తించి ఆ పొలాలకు నీరు అందే విధంగా కృషి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
గ్రామంలో నెలకొన్న అన్ని విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గ్రామంలో కొత్తగా రెండు 100 కె.వి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తాగునీటి కోసం కొత్తగా 90 వేల లీటర్ల కెపాసిటీ గల కొత్త ట్యాంక్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఎమ్మెల్యే నిధులతో పొలాలకు రోడ్డు
ప్రాథమిక సహకార సంఘంకు గోదాం కావాలని గ్రామస్తులు అడగగా త్వరలో నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పంట పొలాలకు వెళ్లే మార్గంలో రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని.. రోడ్డు కావాలని గ్రామ రైతులు అడగగా రోడ్డును ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేయించి వేస్తామని హామీ ఇచ్చారు. నర్సాయిపల్లి నుంచి మైలారం లింకు రోడ్డులో బీమా కెనాల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
నర్సాయిపల్లిలో ఉన్న కుంటలను పరిశీలించి వాటిలో నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. గ్రామంలోని కుల సంఘ భవనాలకు ప్రోత్సాహకంగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి గాను, కొత్త భవనాల నిర్మాణాలను మంజూరు చేయిస్తానని తెలియచేశారు. గ్రామంలో గతంలో విద్యుత్ షాక్ తో రెండు గేదెలు చనిపోయాయని, వాటికి నష్టపరిహారంగా విద్యుత్ డిపార్ట్మెంట్ నుండి ఒక్కొక్క గేదెకు గాను 40 వేల రూపాయల చొప్పున రెండు చెక్కులు రాములు, గండు అర్జునయ్య గౌడ్ కు అందించారు.
నర్సాయిపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ కింద డైరెక్టర్ స్వామి కు మంజూరైన14 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కొల్లాపూర్ హాస్పిటల్ చైర్మన్ కాటం జంబులయ్య, సింగిల్విండో చైర్మన్ వద్ది కృష్ణా రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ రెడ్డి జంబుల బిచ్చా రెడ్డి,టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తాళ్ల బాల స్వామి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మేస్త్రి నరసింహ,వార్డు సభ్యులు రాంరెడ్డి, వసంతం వెంకటేష్, అన్న సాయి లీల పర్వతాలు, సింగిల్ విండో డైరెక్టర్ కుమ్మరి బాల స్వామి,అర్జునయ్య గౌడ్, ఆంజనేయులు, బత్తుల బాలమ్మ మల్లయ్య , గ్రామ టీఆర్ఎస్ నాయకులు కుర్వ భూషయ్య, సూరయ్య, సాకలి నరసింహ, సాకలి పుల్లయ్య, బయ్య సిద్దారి బాలయ్య, కుమ్మరి ఖాజా, ఎమ్మెల్యే బాలస్వామి,మాజీ ఉప సర్పంచ్ బయ్య గోపాల్,తాళ్ల వెంకట్,తాళ్ల వేణు,తాళ్ల హనుమంత్, కుమ్మరి కురుమయ్య, సంధ్య శ్రీరాములు, రామకృష్ణ ,జంగం రాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.