జెసి శర్మ కమిషన్ నివేదికను తక్షణమే ఆమోదించి అమలు చేయాలనే డిమాండ్ తో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి బుడగ (బేడ) జంగాల హక్కుల పోరాట సమితి సైకిల్ యాత్ర నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట చేరుకుంది. బుడగ (బేడ) జంగాల హక్కుల పోరాట సమితి నేతలు నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని కలిసి తమ డిమాండ్ల సాధనకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందచేశారు. జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు.
జంగాల సమస్యలపై సానుకూలంగా స్పందిచిన ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ జంగాలకు సైకిల్ ర్యాలీకి పూర్తి మద్దతు తెలుతున్నట్లు ప్రకటించారు. నరసరావుపేట నియోజకవర్గంలోని జంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని వివరించారు. ఈ సమస్యపై పలుమార్లు కలెక్టర్ ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కాబట్టి లోతైన విశ్లేషణ జరపాల్సిన అవసరముందన్నారు.
జంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా సముచిత స్థానం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని, కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి ఎంపీలను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో జంగాలు ఎదుర్కొంటున్న సమస్యను కార్మిక శాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బేడ (బుడగ) జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు.