బంగారం షాపు యజమానిని మాటల్లో పెట్టి చోరీ చేసే అగంతకుడిని కొల్లాపూర్ పోలీసులు చాకచచ్యంగా పట్టుకున్నారు. కొల్లాపూర్ పట్టణం పరిధిలోని రాజవీధిలో ఉన్న విజయలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం చోరీకి పాల్పడిన కేసును ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్, పెంట్లవెల్లి ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఛేదించినట్లు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం పోలీస్ స్టేషన్ సిఐ ఛాంబర్ లో మీడియా సమావేశంలో చోరీకి సంఘటన అంశాలను ఆయన వివరించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ప్రాంతానికి చెందిన బన్నీ హశం అనే వ్యక్తి ఈ విధంగా కొల్లాపూర్ లో, కల్వకుర్తిలో కూడా చోరీ చేశాడు. ఈ నెల రెండో తేదీ విజయలక్ష్మి జ్యువెలర్స్ కు వెళ్లిన హశం తనకు పంచలోహ నగలు కావాలని అడిగి షాపు యజమానిని మాటల్లో పెట్టి అక్కడ బంగారు ఉంగరాలు పెట్టిన డబ్బాను కొట్టేశాడు.
షాపు యజమాని ఆ తర్వాత దాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారణ కోసం అన్ని కోణాలను పరిశీలించారు. నేడు రాజాగారి కోట దగ్గర పోలీసులు కాపు కాసి అనుమానాస్పదంగా తిరుగుతున్న హశం ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారపు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తిలో కూడా ఇదే తరహా చోరీ చేసినట్లు అతడు అంగీకరించాడు.
అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రెండు లక్షల రూపాయల వరకూ ఉంటుంది. అతి తక్కువ సమయంలో చోరీ కేసు ఛేదించిన ఎస్సై కంపెనీ మురళి గౌడు, ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బందిని సిఐ వెంకట్ రెడ్డి అభినందించారు. త్వరలో రివార్డు ప్రకటిస్తామని చెప్పారు.