జాతీయ విపత్తుగా పరిణమించిన “కోవిడ్ – 19” (కరోనా వైరస్) వ్యాప్తిని నివారించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని, దీనిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవన్ లలో నిర్వహిస్తున్న కాంటీన్ ను ముందు జాగ్రత్త చర్యగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి 31వ తేదీ మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఎపి భవన్ లోని సాయి కాట్రర్స్ కాంటీన్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు, దేశ రాజధానిలో వివిధ పనుల నిమిత్తం వచ్చే అధికారులు, సిబ్బంది సహకరించి, కరోనా వైరస్ నిర్మూలనకు తమవంతు సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవన్ లకు అనుబంధంగా వున్న అతిధి గృహాలలో బస చేస్తున్నవారికి అల్పాహారం, భోజన వసతిని వారి వారి రూములకే పార్సిల్స్ ద్వారా అందచేస్తారని అన్నారు. అల్పాహారం, భోజనం కోసం వస్తున్న ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ పనుల నిమిత్తం ఢిల్లీ కి వచ్చి ఎపి/టిస్ భవన్ల అతిధి గృహాలలో విడిది చేస్తున్న వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుటతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి, నిర్మూలించేందుకు చేస్తున్న సూచనలను తూచా తప్పక పాటించి తమ ఆరోగ్యాలను, తోటి ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు.