హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అసలు పోటీలో కనిపించ లేదు. ఎన్నిక ఏకగ్రీవమైంది. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా టీడీపీ అభ్యర్థులు గెలిచారు.
టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ ను ప్రెసిడెంట్ గా డైరెక్టర్లు ఎన్నుకున్నారు. మద్దిపట్ల శివరామకృష్ణ వరుసగా ఐదవసారి బ్యాంక్ చైర్మెన్ గా భాద్యతలు తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముందుగానే శ్రేణులకు హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే వేరే విధంగా జరిగింది. దాంతో హోంశాఖ మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురైనట్లు అయింది.
హోం మంత్రి త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక వేశారు. అయితే టీడీపీ నాయకుల వ్యూహాలను ఛేదించడంలో హోంమంత్రి వనిత విఫలమయ్యారు. కొవ్వూరులో అర్బన్ ఎన్నికల వ్యవహారంపై వైసిపి అధిష్టానం ఆరా తీస్తున్నది. జిల్లా రిజిస్ట్రార్ కొవ్వూరు అర్బన్ బ్యాంక్ కు చేరుకున్నారు.