సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని జనవరి 16వ తేదీ గురువారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ ఘనంగా జరుగనుంది. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ గోశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం 6 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8 నుండి 9 గంటల వరకు తిరుమలలోని ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. ఆ తరవాత టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భజనలు, కోలాటం నిర్వహిస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు వినిపిస్తారు. ఈ సందర్భంగా రంగోలీలు వేస్తారు.
ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. అనంతరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్య కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11.45 గంటల నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.