అవసరమైన ప్రతి ఒక్కరు న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్పర్సన్ మరియు పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి జీ మాలతి అన్నారు. బుధవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశంలో జాతి,మత,కుల,వర్గ,
వర్ణ,లింగ బేధాలు లేకుండా అందరికీ సమాంతరంగా న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని పేర్కొన్నారు. అదే విధంగా కోర్టులలో దావాలు ఏళ్ళ తరబడి సాగితే వాది ప్రతి వాదుల్లో ఒక్కరే విజయం సాధిస్తారని అదే లోక్ అదాలత్ నందు పరస్పరం అవగాహనతో చర్చించుకుని రాజీ పడినట్లు అయితే ఇరువురూ విజయం సాధిస్తారని దానితో పాటు సమయం ధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఈ నెల 12వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని రాజీ పడదగిన క్రిమినల్ మరియు సివిల్ కేసులు పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి రామచంద్రుడు, కె వాణి, అబ్దుల్ షరిఫ్, రహంతుల్లా, శ్రీ సీతా, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మందలపు వేణు గోపాల్ రావు, హరిదాసు గౌరీ శంకర్, న్యాయవాదులు, కక్షీదారులు, న్యాయ స్థానాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని యర్రంశెట్టి అనిల్ కుమార్ పర్యవేక్షించారు.