జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టరును దిశ మహిళా పోలీసు స్టేషనులో దిశ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిశ డిఎస్పీ
ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికల రక్షణ, భద్రతకు పోలీసుశాఖ ఎన్నో చర్యలు చేపడుతున్నదన్నారు. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు వివక్ష చూపొద్దని, ఇరువురిని సమాన దృష్టితో చూడాలని, మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా అవకాశాలు కల్పించి, ప్రేమను పంచాలన్నారు.
దురదృష్టవసాత్తు నేడు చాలామంది తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్స్కు ఉపక్రమిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలు అనాలోచితమైన, అనాగరిక చర్యలన్నారు. మారుతున్న కాలంతోపాటు మనం మారాలని, ఆడపిల్లల పట్ల వివక్షకు స్వస్తి పలకాలన్నారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం.. అని దిశ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపు నిచ్చారు. జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం చైర్మన్ పెంకి చిట్టిబాబు మాట్లాడుతూ – ఆడపిల్లలను బ్రతకనివ్వడం ద్వారానే సమాజం వృద్ధి చెందుతున్నారు.
ఈ సృష్టికి మూలమైన స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలురతోపాటు బాలికలకు కూడా సమాన హక్కులున్నాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. బాలికలు హక్కులు, రక్షణకు, భద్రతకు విఘాతం కలిగినపుడు అందుకు బాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు చట్టాలు కూడా అమలులో ఉన్నాయన్నారు. బాలికల రక్షణ పొందే హక్కుల్లో భాగంగా బాల్య వివాహాలను, వారిపై లైంగిక వేధింపులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందన్నారు.ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టరును దిశ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం చైర్మన్ పి.చిట్టిబాబు, దిశ మహిళా పిఎస్ ఎస్ఐలు కే.టి.ఆర్. లక్ష్మి, కె.వి. నరసింహారావు, మోంట్ ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ కో-ఆర్డినేటరు కె. వరలక్ష్మి, సమాజ చైతన్య వేదిక ప్రతినిధి సత్యవతి, జెమ్.జె.డైరెక్టరు జొన్నాడ చిన్నారావు, విద్యాసాగర్, మహిళా సంఘాల ప్రతినిధులు చింత జ్యోతి, ఎస్. పార్వతి, బాలికలు తదితరులు పాల్గొన్నారు.